Banglore: ప్రియుడే కావాలంటూ... మొగుడిని వదిలించుకునేందుకు అత్యాచార నాటకం!

  • అత్యాచారం జరిగిందని చెబితే భర్త వదిలేస్తాడన్న ఆలోచన
  • బెంగళూరు యువతి వినూత్న ప్లాన్
  • వైద్యుల నివేదికతో బట్టబయలైన నాటకం

ప్రియుడికి దూరం కాలేక, భర్తలను హత్య చేయిస్తున్న మహిళల సంఖ్య పెరిగిపోతున్న ఈ రోజుల్లో, అదే సమస్య ఎదురైన ఓ యువతి కాస్తంత వెరైటీగా కథ నడిపింది. తనపై అత్యాచారం జరిగిందని చెబితే, భర్త వదిలేస్తాడని, అప్పుడు ప్రియుడితో హాయిగా ఉండిపోవచ్చని కలలు కంది. అయితే, పోలీసులు, వైద్యులు ఆమె ప్లాన్ ను బయటపెట్టారు. ఈ ఘటన బెంగళూరు పరిధిలోని బ్యాటరాయనపురలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ నెల 6వ తేదీన పోలీసు స్టేషన్ కు ఏడుస్తూ ఓ 20 ఏళ్ల యువతి వచ్చింది.

మూడు నెలల క్రితమే తనకు పెళ్లయిందని, తాను రోడ్డుపై వెళుతుంటే, ఓ కారు ఆపి చిరునామా అడుగుతున్నట్టు నటించి, కారులోకి లాగేశారని, నోరు మూసి, రోజంతా తనను తిప్పుతూ, కారులోనే నలుగురూ తనపై పశువుల్లా పడి అత్యాచారం చేశారని వాపోయింది. ఇక తాను ఇంటికి ఎలా వెళ్లాలని, భర్తతో ఎలా కాపురం చేయాలని వలవలా ఏడ్చింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి విచారణ జరిపారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపగా, ఆమె నెల రోజుల నుంచి అసలు సెక్స్ లో పాల్గొనలేదన్న రిపోర్టు వచ్చింది.

ఆపై ఆమె కిడ్నాప్ కు గురైనట్టు చెప్పిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే, ఆమె ఎక్కడా కనిపించ లేదు. దీంతో కాస్తంత గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పింది. తనకు భర్తంటే ఇష్టం లేదని, పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందని చెబితే భర్త వదిలేస్తాడన్న ఆలోచనతో ఈ నాటకం ఆడినట్టు చెప్పడంతో ముక్కున వేలేసుకున్న పోలీసులు, ఆమెను హెచ్చరించి పంపారు.

More Telugu News