National Anthem: సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనపై కేంద్రం యూటర్న్.. అనవసరమని సుప్రీంలో అఫిడవిట్!

  • థియేటర్లలో జాతీయ గీతాలాపన అనవసరమన్న కేంద్రం
  • ఎక్కడ? ఎప్పుడు? పాడాలన్న దానిపై అధ్యయనానికి కమిటీ
  • నివేదిక వచ్చే వరకు పూర్వస్థితిని కొనసాగించాలని అభ్యర్థన

సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసవరం లేదని కోర్టుకు తెలియజేసింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు 16 నవంబరు 2016లో ఇచ్చిన తీర్పు ముందునాటి స్థితిని పునరుద్ధరించాలని కోరింది.
 
సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పౌరులు తమలోని దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కొందరు వాదించారు. జాతీయ గీతాలాపనకు సినిమా హాళ్లు వేదిక కాకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో తర్జన భర్జన పడిన ప్రభుత్వం దిగి వచ్చింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనేదానిపై అధ్యయనం కోసం అంతర-మంత్రిత్వ శాఖ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లోపు ఈ బృందం నివేదిక ఇవ్వనుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

More Telugu News