i love muslims: ‘ఐ లవ్‌ ముస్లిమ్స్‌’ అంటూ మెసేజ్ పెట్టిన హిందూ అమ్మాయికి వేధింపులు.. ఆత్మహత్య!

  • కర్ణాటకలోని చిక్‌మగళూరులో దారుణ ఘటన
  • తన స్నేహితుడితో వాట్సప్‌లో సరదాగా ఛాటింగ్
  • ‘ఐ లవ్‌ ముస్లిమ్స్‌’ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్
  • యువతి ఇంటికొచ్చి ఆమె తల్లిదండ్రులను హెచ్చరించిన బీజేపీ నేత

కర్ణాటకలోని చిక్‌మగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు మతవాదులు ఓ అమ్మాయిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అందుకు కారణం ఆ అమ్మాయి సరదాగా ‘ఐ లవ్‌ ముస్లిమ్స్‌’ అని వాట్సప్‌లో మెసేజ్ చేయడమే. వివరాల్లోకి వెళితే, ధన్యశ్రీ అనే 20 ఏళ్ల బీకాం విద్యార్థిని సంతోష్‌ అనే తన స్నేహితుడితో వాట్సప్‌లో ఛాటింగ్ చేస్తోంది. అందులో కులం, మతాల గురించి మాట్లాడుకుంటున్నారు. ముస్లింలంటే నచ్చని ఆ యువకుడికి సరదాగా కోపం తెప్పించాలని ‘ఐ లవ్‌ ముస్లిమ్స్‌’ అని ఆమె మెసేజ్ చేసింది.

దీంతో ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ముస్లింలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పాడు. ధన్య చేసిన ఆ మెసేజ్‌ను స్క్రీన్‌ షాట్ తీసి స్థానిక భజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ సభ్యులకు పంపాడు. ఆమె మెసేజ్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై నానా రకాలుగా కామెంట్లు రావడంతో ధన్యశ్రీ మనస్తాపం చెందింది. అంతేకాదు, ఆమె ఇంటికి వెళ్లిన ముడిగెరె పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనిల్‌ రాజ్.. ఇటువంటి పనులు చేయొద్దని ధన్యశ్రీ తల్లిదండ్రులను హెచ్చరించాడు.

దీంతో ఆమె అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తన జీవితాన్ని, చదువును నాశనం చేసిందని ధన్యశ్రీ  ఆత్మహత్య లేఖలో పేర్కొంది. సదరు బీజేపీ నేతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News