indrakaran reddy: మేడారం జాతరకు ఈ సారి రూ.80 కోట్లు మంజూరు చేశాం!: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • ఈ నెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు మేడారం జాత‌ర‌
  • వివిధ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది వ‌చ్చే అవ‌కాశం
  • గ‌త జాతరకు 90 ల‌క్ష‌ల మంది భ‌క్తుల హాజరు 
  • ఈ జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాలని కేంద్ర మంత్రిని కోరిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

మేడారం సమ్మ‌క్క‌, సారల‌మ్మ జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని కేంద్ర గిరిజ‌న శాఖ మంత్రి జూయేల్ ఓరాంను కోరిన‌ట్లు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించిన‌ట్లు చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. దాదాపు కోటి మంది భ‌క్తులు పాల్గొనే ఈ పండుగ ప్ర‌పంచంలోనే అతిపెద్ద గిరిజ‌న పండుగ అని కేంద్ర మంత్రికి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రెండేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే మేడారం జాత‌ర‌కు తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం తొలి సంవ‌త్స‌రం 180 కోట్ల‌ను మంజూరు చేసింద‌ని, ఈ సంవ‌త్స‌రం 80 కోట్లు మంజూరు చేసింద‌ని మంత్రి తెలిపారు. ఈ నెల‌ 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు జ‌రిగే మేడారం జాత‌ర‌లో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది పాల్గొన‌వ‌చ్చ‌ని భావిస్తున్న‌ట్లు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. గ‌త జాతరలో 90 ల‌క్ష‌ల మంది భ‌క్తులు పాల్గొన్నార‌ని, ఈ సారి ఆ సంఖ్య మ‌రింత‌గా పెరిగే నేప‌థ్యంలో సౌక‌ర్యాల విష‌యాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇప్ప‌టికే మేడారం జాత‌ర జ‌రిగే పుణ్య‌స్థ‌లానికి నాలుగు లైన్ల రోడ్లు, మౌలిక వ‌స‌తులు, ప‌రిశుభ్ర‌త సంబంధించి అన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, మంత్రి చందూలాల్ తో క‌లిసి మేడారంకు వెళ్లి జాత‌ర ప‌నుల పురోగ‌తిని స‌మీక్షించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు జార్ఖండ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి భారీగా భ‌క్తులు త‌ర‌లి వ‌స్తార‌ని భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.      

More Telugu News