Mobile: 40 శాతం మంది మొబైల్ యూజర్లు ఏడాది లోపే ఫోన్‌ను మార్చేస్తున్నారట!

  • ఫోన్ కోసం రూ.10 వేలకు పైన ఖర్చు పెట్టడానికి కూడా రెడీ
  • ‘సెకెండ్ హ్యాండ్’పై 40 శాతం మంది మొగ్గు
  • యాపిల్, శాంసంగ్ ఫోన్లపై ఆసక్తి

మొబైల్ యూజర్లపై ‘క్వికర్ బజార్’ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దాదాపు 40 శాతం మంది కొన్న ఏడాది లోపే తమ మొబైల్‌ను మార్చేస్తున్నారని వెల్లడైంది. కేవలం రెండు శాతం మంది మాత్రమే కనీసం నాలుగేళ్లపాటు వాడుతున్నట్టు సర్వే తేల్చింది.

క్వికర్ బజార్ నిర్వహించిన ఈ సర్వేలో 75 శాతం మంది మొబైల్ కోసం రూ.10 వేల కంటే ఎక్కువ వెచ్చించేందుకు రెడీ అవుతున్నట్టు తేలింది. 25 శాతం మంది మాత్రం తాము రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు ఖర్చు పెడతామని చెప్పారు.

28 శాతం మంది యాపిల్, శాంసంగ్ వంటి బ్రాండ్లపై కోరికను వ్యక్తం చేయగా  ఆ తర్వాతి స్థానాల్లో మొటొరోలా, వన్‌ప్లస్ ఫోన్లపై ఆసక్తి చూపించారు. 40 శాతం మంది తాము సెకండ్ హ్యాండ్ మొబైళ్లు కొనుగోలు చేస్తామని చెప్పుకొచ్చారు.

సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వగా, ఆ తర్వాత కెమెరా, గేమింగ్‌ గురించి  చెప్పుకొచ్చారు. కేవలం  పదిశాతం మంది మాత్రం తమ ఫోన్లలో మ్యూజిక్, వీడియోలను చూస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News