Gali Janardana reddy: నాడు జేడీ రాగానే 'ఐ యామ్ వెయిటింగ్' అన్నా... జగన్ విషయం పట్టించుకోను: గాలి జనార్దన్ రెడ్డి లేటెస్ట్ ఇంటర్వ్యూ

  • బీజేపీలో ఉన్నాననే జైల్లో పెట్టారు
  • ఏ తప్పూ చేయలేదన్న గాలి
  • బంగారు కుర్చీలు ఉన్నాయన్నది గాలి మాటలే
  • కుమార్తె పెళ్లికి రూ. 30 కోట్లే ఖర్చు 

తాను ఏ తప్పూ చేయలేదని, కర్ణాటకలో బీజేపీ ఎదుగుదలకు సహకరిస్తున్నానన్న కారణంతోనే యూపీఏ ప్రభుత్వం నాలుగేళ్లు తనను జైలులో పెట్టించిందని గనుల అక్రమ తవ్వకం కేసు నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజాయితీగా ఉన్నానని, ఏ తప్పూ చేయలేదని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో గాలి వ్యాఖ్యానించారు.

దివంగత సీఎం వైఎస్‌ కు, తనకు మధ్య ఉన్నది ఓ వ్యాపారవేత్తకు, ప్రభుత్వాధినేతకు మధ్య ఉండేటటువంటి సంబంధమేనని అన్నారు. ఇప్పుడు జగన్ విషయంలో వేలు పెట్టబోనని, తన రాజకీయాలు కర్ణాటకకు మాత్రమే పరిమితమని అన్నారు. సుంకులమ్మ ఆలయం వివాదంపై స్పందిస్తూ, ఆలయం అక్కడ వద్దని స్వయంగా గనుల శాఖే చెప్పిందని అన్నారు. తనపై కేసుల తీవ్రత పెరిగిన తరువాత, అరెస్ట్ చేస్తారని తెలిసిపోయిందని, నాడు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన ఇంటికి రాగానే 'ఐ యామ్ వెయిటింగ్' అన్నానని తెలిపారు.

 తన ఇంట్లో బంగారు కుర్చీలు, బంగారు కంచాలు ఉన్నాయని జరిగిన ప్రచారం అవాస్తవమని, అవన్నీ ప్రత్యర్థులు సృష్టించినవేనని తెలిపారు. తన నుంచి ఏమేం సీజ్ చేశారో సీబీఐ దగ్గర జాబితా ఉందని అన్నారు. తన ఆస్తి అందరూ అనుకున్నట్టు లక్ష కోట్లకు పైగా ఏమీ లేదని, కొన్ని వందల కోట్లే ఉన్నాయని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

తన కుమార్తె పెళ్లికి రూ. 30 కోట్ల వరకూ మాత్రమే వెచ్చించామని, రూ. 400 కోట్లు, రూ. 500 కోట్లని పుకార్లు పుట్టించారని ఆరోపించారు. యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్‌ మాల్యాలా తాను వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోలేదని తెలిపారు. గతంలో ట్యాంకుబండ్‌ పై స్వీపర్లకు లక్షలు పంచినట్టు వచ్చిన వార్తలు వాస్తవమేనని అన్నారు.

More Telugu News