Badminton: దేశంలో ఆడి నష్టపోయా: కిదాంబి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

  • నంబర్ వన్ ర్యాంకును చేరుకోలేకపోయిన శ్రీకాంత్
  • ఇంటర్నేషనల్ టోర్నీకి ముందు దేశవాళీ పోటీలు
  • బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్ణయంతో ఇండియాలో ఆడిన కిదాంబి
  • బిజీ షెడ్యూల్ తో సత్తా చూపలేకపోయిన శ్రీకాంత్

జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడటం వల్ల తాను ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయానని ఏస్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీడబ్ల్యూఎఫ్ పురుషుల సింగిల్స్ లో తాను తొలి స్థానానికి చేరకపోవడానికి నేషనల్ లెవల్ లో జరిగిన బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్పే కారణమని తెలిపాడు. ఈ సంవత్సరంలో డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో విజేతగా నిలిచి వరల్డ్ నంబర్ 2 ర్యాంకును సాధించిన శ్రీకాంత్, ఆపై చైనా, హాంకాంగ్ ఓపెన్ లు ఆడి అదే విధమైన ప్రతిభ కనబరిచి వుంటే నంబర్ వన్ ర్యాంకు సొంతమయ్యేది.

 కానీ, ఈ మధ్యలో జాతీయ బ్యాడ్మింటన్ ఆడిన వేళ శ్రీకాంత్ గాయపడ్డాడు. విశ్రాంతి లేని షెడ్యూల్, గాయాల ప్రభావంతో వరల్డ్ సూపర్ సిరీస్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించాడు. తాను అయిష్టంగానే దేశవాళీ టోర్నీలో ఆడానని చెప్పకనే చెప్పిన శ్రీకాంత్, సూపర్ సిరీస్ లో తాను మరింత మెరుగ్గా ఆడాల్సివుందని చెప్పాడు. కాగా, ఇండియాలో బ్యాడ్మింటన్ కు మరింత ఆదరణను పెంచాలన్న ఉద్దేశంతో ఉన్న భారత బ్యాడ్మింటన్ సమాఖ్య, సింధు, సైనా, శ్రీకాంత్ లను నేషనల్ బ్యాడ్మింటన్ లో ఆడించిన సంగతి తెలిసిందే.

More Telugu News