RBI: ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం.. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకునే అవకాశం.. వెల్లడించిన ఎస్‌బీఐ నివేదిక

  • రూ.2000 వేల నోట్ల ముద్రణను ఆపేసిన ఆర్బీఐ
  • ముద్రించిన నోట్లను కూడా తన వద్దే పెట్టుకున్న రిజర్వు బ్యాంకు
  • లావాదేవీల్లో సమస్యలే కారణమంటున్న అధికారులు

భారతీయ రిజర్వు బ్యాంకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. అతి త్వరలో రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవడం కానీ, లేదంటే నోట్ల ముద్రణను ఆపేయడం కానీ చేయాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది.

ఆర్బీఐ అధికారి ఒకరు ఇచ్చిన వార్షిక నివేదిక (ఎస్‌బీఐ ఎకోఫ్లాష్)ను  ఇటీవల లోక్‌సభ ముందు ఉంచారు. దాని ప్రకారం.. మార్చి 2017 నాటికి రూ. 3,501 బిలియన్ల చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. డిసెంబరు 8 నాటికి రిజర్వు బ్యాంకు మొత్తం 16,597 మిలియన్ల రూ.500 నోట్లు, 3,654 మిలియన్ల రూ.2000 వేల నోట్లను ముద్రించింది. వీటి విలువ రూ.15,787 బిలియన్లు.

అయితే డిసెంబరు 8 నాటికి రూ.13,324 బిలియన్ల విలువైన పెద్ద నోట్లు మాత్రమే చలామణిలోకి వచ్చాయి. అంటే ఇంకా రూ.2,463 బిలియన్లు ఆర్బీఐ దగ్గరే ఉండిపోయినట్టు ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. దీంతో రూ. 2000 నోట్ల ముద్రణను ఆపేసి చిన్ననోట్ల ముద్రణను చేపట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. పెద్ద నోట్ల వల్ల లావాదేవీల్లో వివిధ రకాల సవాళ్లు ఎదురవుతున్నాయని భావించే ఆర్బీఐ వాటి ముద్రణను ఆపేసినట్టు ఘోష్ పేర్కొన్నారు.

More Telugu News