జయలలితది ఒరిజినల్ వీడియో కాదు.. మార్ఫింగ్: మండిపడ్డ అన్నాడీఎంకే

  • మార్ఫింగ్ చేసిన వీడియోను విడుదల చేశారు
  • ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే ఈ పని చేశారు
  • ఆర్కే నగర్ ఉప ఎన్నిక ముందు రోజు వీడియో విడుదల
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో, ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో దినకరన్ వర్గీయులు ఆసుపత్రిలో జయలలిత చికిత్ప పొందుతున్నప్పటి ఒక వీడియోను విడుదల చేశారు. జయకు మెరుగైన చికిత్స అందించామని తెలియజేసే క్రమంలో ఈ వీడియోను వ్యూహాత్మకంగా బయటపెట్టారు.  జయలలిత మరణానికి శశికళే కారణమంటూ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తద్వారా ఉప ఎన్నికలో సానుభూతి ద్వారా ఓట్లను సాధించేందుకు ఎత్తుగడ వేశారని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఈ వీడియోపై ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మండిపడుతున్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది జయలలిత కాదని, ఇది మార్ఫింగ్ వీడియో అని ఆరోపించారు. జయలలిత మరణించిన తర్వాత కానీ, ఈ ఏడాది కాలంగా కానీ బయటపెట్టని వీడియోను, ఇప్పుడు ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న జయను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని... చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు కూడా ఆమెను చూపించలేదని చెప్పారు.

 ఈ నేపథ్యంలో ఈ వీడియోపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇది ముమ్మాటికీ మార్ఫింగ్ వీడియోనే అని తెలిపారు. ఎలక్షన్ నేపథ్యంలోనే, ఇలాంటి వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేశారని మండిపడ్డారు.
Go Back to Shorts
jayalalitha
jayalalitha video
aiadmk

More Telugu News