Love Marriage: విజయవాడ అబ్బాయి, రాజస్థాన్ అమ్మాయి... హైదరాబాద్ లవ్ స్టోరీ!

  • లవ్ లో పడ్డ రాజేశ్, ప్రియాంక
  • ఆర్యసమాజ్ లో పెళ్లి
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తాము మేజర్లమని నిరూపించుకున్న లవర్స్

అబ్బాయిది విజయవాడ, అమ్మాయిది రాజస్థాన్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు భాగ్యనగరం వేదికైంది. యథాప్రకారం వారి ప్రేమకు పెద్దలు అడ్డుపడ్డారు. ఆపై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే... కొన్ని రోజుల ముందు నుంచి జరిగిన విషయాలను పరిశీలించాలి. విజయవాడకు చెందిన ఆలూరి రాజేష్, ఈసీఐఎల్ పరిధిలోని ఒక షోరూములో పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో మిఠాయి దుకాణాన్ని నిర్వహిస్తున్న రాజస్థాన్ వ్యక్తి నటుల్ ఉమ్మన్, తన తమ్ముడి కుమార్తె ప్రియాంకను తెచ్చి పెంచుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇరుగు, పొరుగున ఉన్న రాజేష్, ప్రియాంకల మధ్య స్నేహబంధం ఏర్పడి, అది ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న యువతి పెదనాన్న ఆమెను, తిరిగి రాజస్థాన్ పంపాడు. ప్రియాంకను వదిలి ఉండలేని రాజేష్, రాజస్థాన్ కు వెళ్లి, తన ప్రియురాలిని తీసుకొచ్చి హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆపై బాలిక తండ్రి కైలాశ్, రాజస్థాన్ లోని పుఫుబారా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తన కుమార్తెను కిడ్నాప్ చేశారని కేసు పెట్టాడు.

దీంతో అక్కడి నుంచి వచ్చిన పోలీసులు, అనుములవీడులోని వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని తహసీల్దారు ఎలిజబెత్ రాణి వద్ద హాజరు పరిచారు. ఆమె ఇద్దరితోనూ విడివిడిగా మాట్లాడగా, తాము ప్రేమించుకున్నామని, కలిసే ఉంటామని చెబుతూ, తాము మేజర్లమని నిరూపించే పత్రాలను అందించారు. దీంతో వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న రాజస్థాన్ పోలీసులు వెనక్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

More Telugu News