Tamilnadu: తమిళనాడు గవర్నర్ పై ఫిర్యాదు... తనను నగ్నంగా చూశాడన్న యువతి!

  • స్నానం చేస్తుంటే తొంగి చూసిన భన్వరీలాల్
  • కలకలం రేపుతున్న వార్త
  • కడలూరు జిల్లాలో ఘటన
  • ఉన్నతాధికారుల సలహా కోరిన పోలీసులు

తమిళనాడు గవర్నర్ భ‌న్వ‌రీలాల్ పురోహిత్ తాను స్నానం చేస్తుంటే తొంగి చూశాడని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఓ యువతి చేసిన ఫిర్యాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వార్తలో నిజం లేదని, ఆయన గ్రామాల్లోని మరుగుదొడ్లు, స్నానపు గదులను తనిఖీ చేసేందుకు వెళ్లిన సమయంలో, ఆరోపణలు వస్తున్న బాత్ రూములో ఎవరూ లేరని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించినప్పటికీ, మీడియాలో వచ్చిన కొన్ని ఫోటోలు, దృశ్యాలు సంచలనం కలిగిస్తున్నాయి.

క‌డ‌లూరు జిల్లాకు వెళ్లిన భన్వరీలాల్, ఓ కాలనీకి వెళ్లి, త‌డికెల‌తో క‌ట్టిన స్నానపు గదిలోకి తొంగి చూశారు. ఆపై దిగ్భ్రాంతితో వెనక్కు వచ్చారు. గవర్నర్ స్వయంగా మహిళ స్నానం చేస్తుంటే తొంగి చూశారని, ఆమె అరుస్తూ, పరిగెట్టిందని ఆపై కాసేపటికే టీవీ చానల్స్ లో వార్త ఫ్లాష్ అయింది. పొరపాటునే జరిగినా, గవర్నర్‌ చర్యకు షాక్‌ తిన్న బాధిత మహిళ, తన పరువుకు భంగం కలిగిందంటూ, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే గవర్నర్‌ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ సమయంలో కడలూరు కలెక్టర్‌ తో పాటు, ఏఐడీఎంకేకు చెందిన నేతలు ఉన్నారని, వారంతా జరిగిన ఘటనకు సాక్ష్యమేనని చెప్పింది. ఇక విశేషాధికారాలు, రాజ్యాంగ రక్షణ ఉన్న గవర్నర్ పై కేసు రిజిస్టర్ చేసే అధికారం పోలీసుల వద్ద లేకపోవడంతో, వారు ఈ కేసు విషయంలో ఏం చేయాలన్న విషయమై ఉన్నతాధికారులకు సమాచారం పంపారు.

More Telugu News