మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ పోరాడుతున్న 80 ఏళ్ల సుబ్బమ్మ మృతి!

  • సుబ్బమ్మ నేతృత్వంలో ఏకమైన మహిళలు
  • 80 ఏళ్ల వయసులో మద్యానికి వ్యతిరేకంగా పోరాటం
  • దిగొచ్చిన అధికారులు.. అంతలోనే గుండెపోటుతో మృతి
గ్రామంలో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ ఈనెల 8 నుంచి జరుగుతున్న ఆందోళనలో కీలకపాత్ర పోషిస్తున్న ముదునూరి సుబ్బమ్మ (80) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన సుబ్బమ్మ.. గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఆమె నేతృత్వంలో మహిళలంతా ఏకమై  పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

 అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండు రోజుల క్రితం 20 మంది మహిళలు గ్రామంలోని చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్పందించిన అధికారులు గురువారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో పాల్గొనకుండానే సుబ్బమ్మ మృతి చెందారు. సభకు హాజరుకావడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. 80 ఏళ్ల వయసులో మహిళల్లో చైతన్యం నింపి మద్యానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమె మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.
Go Back to Shorts
Wine shop
West Godavari
Subbamma

More Telugu News