roja: నీచాతి నీచంగా నాపై సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు: ఎమ్మెల్యే రోజా

  • వారి టార్గెట్ మొద‌ట జ‌గ‌న్‌పై.. ఆ త‌రువాత నాపైనే
  • ఇటువంటివి పెట్టేవారికి నిజంగా భార్యాపిల్ల‌లు ఉన్నారా? అనిపిస్తోంది
  • వారి భార్యపై లేక కూతురిపై ఎవ‌రైనా ఇలాగే పోస్టులు పెడితే వారి ప‌రిస్థితి ఏంటి?  

ప్ర‌లోభాల‌కు లొంగిపోయి త‌మ పార్టీలో చేరిన వారిని టీడీపీ నేత‌లు మంచివారు అని అంటార‌ని, ఒకవేళ టీడీపీలో చేర‌క‌పోతే ఎంత నీచానికైనా దిగ‌జారి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై దుష్ప్ర‌చారం చేస్తార‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌హిళా నేత‌లను ఒక ఆడ‌ద‌ని కూడా చూడ‌కుండా ఎన్నో ఆరోప‌ణ‌లు చేస్తార‌ని అన్నారు.

ఈ రోజు ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... గ‌త అనుభ‌వాలు చూస్తే త‌న‌ను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేశార‌ని, టీడీపీ నేతల టార్గెట్ మొద‌ట‌ జ‌గ‌న్‌పైన అని, ఆ త‌రువాత తానేన‌ని రోజా చెప్పారు. చంద్ర‌బాబు నాయుడి మెప్పుకోసం, మంత్రి ప‌ద‌వుల కోసం టీడీపీ నేత‌లు త‌న‌ను ఎన్నో ర‌కాలుగా విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. నంద్యాల ఎన్నిక‌ల త‌రువాత తాను గుండు గీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశార‌ని, ఫ్లెక్సీలు పెట్టుకున్నార‌ని అన్నారు. దీన్ని బ‌ట్టి చంద్ర‌బాబు నాయుడు చేసే రాజ‌కీయాలు ఎంత‌గా దిగ‌జారి పోతున్నాయో తెలుస్తోందని అన్నారు.

ఇలా నీచాతి నీచంగా వారు త‌న‌పై ఫ్లెక్సీలను, సోష‌ల్ మీడియాలో పోస్టులను పెడుతున్నార‌ని రోజా అన్నారు. ఇటువంటివి పెట్టేవారికి నిజంగా భార్యాపిల్ల‌లు ఉన్నారా? అని వాటిని చూస్తున్న‌ప్పుడు త‌న‌కు అనిపిస్తుంటుంద‌ని చెప్పారు. వారి భార్యపై లేక కూతురిపై ఎవ‌రైనా ఇలాగే పోస్టులు పెడితే వారి ప‌రిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. సంబంధం లేకుండా జ‌బ‌ర్ద‌స్త్ వీడియో లేక త‌న ఇంట‌ర్వ్యూకు సంబంధించిన వీడియో తీసుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మార్చి పోస్టులు పెడుతుంటార‌ని అన్నారు.     

More Telugu News