Tollywood: 24, 25 తేదీల్లో ‘సీసీఎల్ టీ10 బ్లాస్ట్’.. ఉప్పల్‌లో క్రికెట్ ఆడనున్న సినీ తారలు!

  • ఉప్పల్‌ స్టేడియంలో సీసీఎల్ మ్యాచ్‌లు
  • అభిమానుల మనసు దోచేందుకు కొత్త ఫార్మాట్‌తో ముందుకు.
  • పాల్గొంటున్న అన్ని చిత్రపరిశ్రమల నటీనటులు

ఈనెల 24, 25 తేదీల్లో సినీ తారలు బ్యాట్, బాల్ పట్టనున్నారు. సీసీఎల్‌లో భాగంగా జరగనున్న తారల క్రికెట్ పోటీలకు సంబంధించిన వివరాలను ఆయా జట్ల యజమానులు వెల్లడించారు. ఆరేళ్లుగా జరుగుతున్న సీసీఎల్ ఈసారి ‘సీసీఎల్ టీ10 బ్లాస్ట్’ పేరుతో వస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ 90 నిమిషాల్లో పది ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచుల్లో  తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులందరూ పాల్గొంటారని వివరించారు. సోనీ, ఈఎస్‌పీఎన్‌లు ఈ మ్యాచ్‌లను ప్రసారం చేస్తాయన్నారు. పది ఓవర్ల మ్యాచ్‌ అభిమానులకు మరింత మజా పంచుతుందని పేర్కొన్నారు.

విలేకరుల సమావేశంలో సీసీఎల్ చైర్మన్ అశోక్ కెనీ, సీసీఎల్ డైరెక్టర్ మూర్తి శ్రీనివాసులు, ఎండీ విష్ణువర్ధన్ ఇందూరి, తిరుమల్ రెడ్డి, ముంబై హీరోస్ జట్టు యజమాని సోహైల్ ఖాన్, తెలుగు వారియర్స్ జట్టు యజమాని సచిన్ జోషి, చెన్నై రైనోస్ జట్టు యజమాని శ్రీకాంత్, కర్ణాటక బుల్డోజర్స్‌ జట్టు కెప్టెన్‌ సుదీప్‌ కిచ్చ, కేరళ స్ట్రైకర్స్‌ జట్టు యజమాని శ్రీప్రియ, రాజ్‌కుమార్‌, బెంగాల్ టైగర్స్‌ జట్టు యజమానులు బోనీకపూర్‌, రాజ్‌షా తదితరులు పాల్గొన్నారు.

More Telugu News