Telangana: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని స్నేహితుల సాయంతో కడతేర్చిన డిగ్రీ చదువుతున్న కుమార్తె!

  • హైదరాబాద్ శివారులోని బీహెచ్ఈఎల్‌లో ఘటన
  • స్నేహితుల సాయంతో హత్యకు ప్లాన్ వేసిన కుమార్తె
  • ముగ్గురు నిందితుల అరెస్ట్.. పరారీలో సూత్రధారి

తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని స్నేహితుల సాయంతో కడతేర్చిందో కూతురు. సంగారెడ్డి జిల్లా రామంచంద్రాపురంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఎల్ఐజీ కాలనీకి చెందిన దుర్గాదాస్ (47) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈనెల 7న స్కూటీపై ఇంటికి వెళ్తున్న అతడిని బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ సమీపంలో అడ్డగించిన కొందరు దుండగులు ఇనుప రాడ్లతో దాడిచేశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గాదాస్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దుర్గాదాస్‌కు అదే కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని డిగ్రీ చదువుతున్న ఆమె కుమార్తె గమనించింది. తల్లితో సంబంధం పెట్టుకున్న అతడిపై కక్ష పెంచుకుంది. అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న ఆమె తన స్నేహితులైన ట్రావెల్స్ నిర్వాహకుడు స్టీఫెన్, బీహెచ్ఈఎల్‌కు చెందిన ఆంటోనీ రాబెలో, వరంగల్‌కు చెందిన శ్రీదీప్ సుందర్ సాయం కోరింది. అందరూ కలిసి దుర్గాదాస్ హత్యకు ప్లాన్ చేశారు.

ఏడో తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తున్న దుర్గాదాస్‌ను వీరు ముగ్గురూ కలిసి కారులో వెంబడించారు. భెల్ టౌన్‌షిప్ సమీపంలో అడ్డగించి ఇనుపరాడ్లతో తలపై మోది పరారయ్యారు. దుర్గాదాస్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కుట్ర పన్నిన యువతి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  

More Telugu News