Sanjay Leela Bhansali: ‘పద్మావతి’ కంటే శాంతిభద్రతలే ముఖ్యమంటున్న గోవా సీఎం

  • సినిమాను నిషేధించాలన్న డిమాండ్ ను పరిశీలిస్తాం
  • సెన్సార్ అనుమతి వచ్చిన తర్వాతే ఓ నిర్ణయం
  • అవసరమైతే వివాదాస్పద అంశాలకు కత్తెర
విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన పద్మావతి సినిమాపై గోవా రాష్ట్రం నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యలే నిదర్శనం. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా కొనసాగుతున్న గోవా రాష్ట్రం శాంతి, భద్రతల సమస్యలను భరించే స్థితిలో లేదని మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ఈ దృష్ట్యా సంజయ్ లీలా భన్సాలీ చిత్రమైన పద్మావతిని రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిషేధించాలన్న బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ ను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ బీజేపీ మహిళా విభాగం ప్రతినిధులు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలసి కోరడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాలేదని, అది వచ్చిన తర్వాత తాము ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే సినిమాలో వివాదాస్పద అంశాలను తొలగించడం జరుగుతుందన్నారు. ‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే చరిత్రను సరైన రీతిలో చూపించాలి. తప్పుడు మార్గంలో దాన్ని చిత్రీకరిస్తే ప్రజల మనోభావాలు గాయపడతాయి’’ అని పారికర్ పేర్కొన్నారు.
Sanjay Leela Bhansali
Padmavati
goa cm

More Telugu News