Australia: ఆస్ట్రేలియాలో భార్యను వేధించిన భర్తకు హైదరాబాద్‌లో అరదండాలు!

  • అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు
  • ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ పోలీసులకు భార్య ఫిర్యాదు
  • శంషాబాద్‌లో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆస్ట్రేలియాలో భార్యను వేధించిన ఓ భర్తకు హైదరాబాద్ పోలీసులు అరదండాలు వేశారు. మల్కాజిగిరి పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ మౌలాలి గోపాల్ నగర్‌లో నివసించే రాజేందర్ తన కుమార్తె ఇంద్రజ (28)ను నెల్లూరులోని మాలాపేటకు చెందిన పి.భరత్ తేజ (33)కు ఇచ్చి జనవరి 24, 2015లో వివాహం చేశారు. భరత్ తేజ ఆస్ట్రేలియాలోని మేరీ బోర్గ్ నగరంలో ట్రూఫుడ్స్ కంపెనీలో హెల్త్ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్నాడు.  

భరత్ విదేశాల్లో పనిచేస్తుండడంతో ఇంద్రజ తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. ఇంద్రజ కూడా తన జీవితం బాగుంటుందని కలలు కన్నది. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే భరత్ తనలోని మరో మనిషిని బయటకు లేపాడు. అదనపు కట్నం కోసం వేధించాడు. అతడి వేధింపులు భరించలేని ఇంద్రజ ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్ట్రేలియా నుంచి వస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన భరత్‌ను అరెస్ట్ చేశారు. ఇంద్రజ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మల్కాజిగిరి సీఐ జానకీరెడ్డి, ఎస్సై మన్మథకుమార్ తెలిపారు.

More Telugu News