Narendra Modi: నాకు ఇంకా గుర్తుంది.. అప్పుడు ఇక్క‌డ ఇందిరా గాంధీ ముక్కుమూసుకున్నారు!: ప్రధాని మోదీ

  • గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం
  • మోర్బీలో మోదీ ప్ర‌సంగం
  • దుర్వాస‌న వ‌స్తోంద‌ని ఇందిర ముక్కు మూసుకున్నారు 
  • జన్‌సంఘ్, ఆరెస్సెస్‌లకు మాత్రం సుగంధమే 

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార‌, విప‌క్ష‌ పార్టీల నేత‌లు మాట‌ల ధాటి పెంచారు. ఈ రోజు ఆ రాష్ట్రంలోని మోర్బీలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌కు ఇప్పటికీ గుర్తుందని, గతంలో ఈ ప్రాంత‌ పర్యటనకు వచ్చినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చెడు వాసన వస్తోందంటూ ముక్కు మూసుకున్నారని అన్నారు.

అప్ప‌ట్లో ఓ గుడ్డతో ఆమె ముక్కు మూసుకోగా తీసిన ఓ ఫొటో ఓ మ్యాగజైన్‌లోనూ వచ్చిందని తెలిపారు. తాను ఆ ఘటనను ఎప్పటికీ మరిచిపోలేనని విమ‌ర్శించారు. ఇందిరా గాంధీ ఈ ప్రాంతాన్ని అలా చూశార‌ని, కానీ జన్‌సంఘ్, ఆరెస్సెస్‌లకు మాత్రం ఈ ప్రాంతం సుగంధాన్ని వెదజల్లుతున్నట్లు క‌నిపిస్తుందని అన్నారు.

మానవత్వపు సువాస‌న‌ను త‌మ నేత‌లు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. తాము మోర్బీ ప్రాంతాన్ని ఎన్న‌డూ చిన్నచూపు చూడలేదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. ఈ ప్రాంతంలో పలు ప్రాజెక్టులు చేపట్టి ప్ర‌జ‌ల‌కు నీటిని అందించిన ఘనత త‌మ పార్టీదేన‌ని తెలిపారు.     

More Telugu News