ivanka: వేగంగా ఎదుగుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి: ఇవాంక ట్రంప్ ప్రశంస

  • ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌
  • భార‌త్‌లో యువతే గొప్ప సంపద
  • జీఈఎస్‌లో 52 శాతం మహిళలు పాల్గొనడం ఎంతో గర్వకారణం

ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్ రూపుదిద్దుకుంద‌ని అమెరికా అధ్య‌క్షుడి స‌ల‌హాదారు ఇవాంక ట్రంప్ ప్రశంసించారు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌, హెచ్‌ఐసీసీలో జ‌రుగుతోన్న జీఈఎస్‌లో ఇవాంక మాట్లాడుతూ... ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన‌ 150 దేశాల ప్రతినిధులకు శుభాకాంక్షలని అన్నారు. ప్ర‌పంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి అని ఆమె చెప్పారు. ప్ర‌పంచంలో కొత్త ఆవిష్కరణలతో వస్తోన్న ఔత్సాహికులతో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని అన్నారు. త‌మ దేశ‌ అధ్యక్షుడు.. భారత్‌ అమెరికాకు నిజమైన మిత్రుడని అంటుంటార‌ని తెలిపారు.

భార‌త్‌లో యువతే గొప్ప సంపదని అన్నారు. జీఈఎస్‌లో 52 శా‌తం మహిళలు పాల్గొనడం ఎంతో గర్వకారణం అని ఆమె అన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు మరింత కష్టపడి ఎద‌గాల్సి ఉంద‌ని అన్నారు. పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10 శాతం పెరిగిందని తెలిపారు. త‌మ దేశంలో ప్ర‌త్యేకంగా కోటీ 10 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని తెలిపారు. యువ పారిశ్రామిక వేత్త‌లుగా విజ‌య‌వంత‌మైన ప‌లువురిని ఈ సంద‌ర్భంగా ఇవాంక ట్రంప్ ప్ర‌శంసించారు.

ఒక్క మహిళ నిలబడితే కుటుంబం, సమాజం, వ్యవస్థలు నిలబడతాయని ఆమె అన్నారు. త‌న తండ్రి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైన తరువాత తాను వ్యాపారాలను ప‌క్కకు పెట్టి సహాయ సహకారాలు అందించేందుకు వచ్చానని తెలిపారు. గ‌త ప‌దేళ్ల‌లో మహిళా పారిశ్రామికవేత్తలు 90 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు.  

 
మోదీ నేతృత్వంలో భారత్‌ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి..

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో ఇండియా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇవాంక ట్రంప్ కొనియాడారు. న‌రేంద్ర మోదీ టీ అమ్మే స్థాయి నుంచి దేశ‌ ప్రధానిగా ఎదిగిన తీరు భారతీయ నిపుణులకు ఎంతో ఆద‌ర్శ‌వంత‌మ‌ని చెప్పారు. మహిళా సాధికారత లేకుండా అభివృద్ధి సాధ్యంకాదని మోదీ అన్నార‌ని, అందుకు ఆయ‌న‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని ఆమె అన్నారు. చాలా దేశాల్లో మహిళలు సామాజిక అవరోధాలను ఎదుర్కొంటున్నారని, విజ‌యం సాధించిన‌ మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌కి ఆద‌ర్శ‌మ‌ని తెలిపారు.

More Telugu News