kolkata test: భారత్ నిరాశ.. ఊపిరి పీల్చుకున్న లంక.. తొలి టెస్ట్ డ్రా!

  • డ్రాగా ముగిసిన కోల్ కతా టెస్ట్
  • గెలుపు అంచుల్లో ముగిసిన మ్యాచ్
  • వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ ను ముగించిన అంపైర్లు

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కిందపడి, ఆ తర్వాత పుంజుకుని, గెలుపు అంచుల వరకు వెళ్లిన తొలి టెస్ట్ మ్యాచ్ అనూహ్యంగా డ్రాగా ముగిసింది. పేస్ బౌలర్లను ఎదుర్కొనేంత లైటింగ్ లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను ముగించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు మాత్రమే చేసింది. మరో 19 ఓవర్లు వరకు మిగిలి ఉన్నాయి. ఫలితం వచ్చే అవకాశం ఉంటే మాండేటరీ ఓవర్లు వేసే అవకాశం ఉంది. కానీ, వాతావరణం భారత్ కు అనుకూలించలేదు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో అప్పటిదాకా టెన్షన్ గా ఉన్న లంక ఆటగాళ్ల ముఖాల్లో చిరునవ్వులు వికసించాయి.

రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టులో 104 పరుగులతో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 79, ధావన్ 94 పరుగులతో స్కోరు బోర్డును కదిలించారు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో పుజారా 22, షమీ 12, జడేజా 9, భువనేశ్వర్ 8, అశ్విన్ 7, సాహా 5, రహానే 0 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్ 4, గమాగే 2, పెరీరా 2, సనక, హెరాత్ లు చెరో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యసాధనకు దిగిన లంక బ్యాట్స్ మెన్లు భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. కెప్టెన్ చండిమల్ 20, డిక్ వెల్లా 27, మ్యాథ్యూస్ 12 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో సమరవిక్రమ డకౌట్, కరుణరత్నే 1, తిరిమన్నే 7, సనక 6 నాటౌట్, పెరీరా డకౌట్ , హెరాత్ 0 డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి లంక నడ్డి విరిచాడు భువనేశ్వర్ కుమార్. షమీ 2, ఉమేష్ యాదవ్ 1 వికెట్ల తీశారు. కాగా, రెండో టెస్టు నాగపూర్ లో నవంబర్ 24 నుంచి 28 వరకు జరగనుంది. 

More Telugu News