జేసీ బ్రదర్స్: జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు: వైసీపీ నేతల ఆరోపణ

  • అనంతపురంలో శాంతిభద్రతలు క్షీణించాయి
  • జేసీ సోదరుల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారు
  • వారు తమ పద్ధతి మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు
  • వైసీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దారెడ్డి ఆరోపణ 

జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పై, వారి అనుచరులపై వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, అనంతపురంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, జేసీ సోదరుల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు.

 వైసీపీ నేత ఉదయ్ భాస్కర్ హత్య కేసులో సాక్షులను జేసీ బ్రదర్స్ బెదిరిస్తున్నారని, ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్ష పడుతుందని దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. జేసీ సోదరులు తమ పద్ధతి కనుక మార్చుకోకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

More Telugu News