deepika padukone: అమరావతిలో తళుక్కుమన్న దీపికా పదుకొనే!

  • సోషల్ మీడియా సమ్మిట్ లో పాల్గొన్న దీపిక
  • అవార్డును అందుకుని ఆనందం వ్యక్తం చేసిన బ్యూటీ
  • ఇక్కడ ఇంతమంది అభిమానులా? అని ఆశ్చర్యం
  • అభివృద్ధి వేగంగా జరుగుతోందని వ్యాఖ్య

బాలీవుడ్ బ్యూటీ, 'పద్మావతి' హీరోయిన్ దీపికా పదుకొనే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తళుక్కున మెరిసింది. విజయవాడలో ఏపీ పర్యాటక శాఖ నిర్వహించిన 'సోషల్‌ మీడియా సమ్మిట్‌ 2017'లో పాల్గొన్న ఆమె, సమ్మిట్ అవార్డును టూరిజం మంత్రి అఖిల ప్రియ చేతుల మీదుగా స్వీకరించి మాట్లాడింది. అమరావతి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించిన దీపిక, ఇక్కడి పచ్చదనం, పరిశుభ్రత తనను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు.

సోషల్ మీడియా చాలా బలమైన మాధ్యమంగా మారిపోయిందని, అమరావతిలో తనను చూసేందుకు ఇంత మంది అభిమానులు రావడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. తాను ఎక్కడికి వెళ్లినా తన విషయాలను అన్నింటినీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటానని చెప్పింది.

తాను ఎప్పుడూ పారదర్శకంగా ఉంటానని, అదే అభిమానులకు, తనకు మధ్య ఓ స్పష్టమైన అవగాహన ఏర్పడటానికి కారణమైందని వెల్లడించింది. త్వరలోనే మరోసారి అమరావతికి వస్తానని చెప్పింది. అవార్డును తనకు బహూకరించినందుకు ఏపీ ప్రభుత్వానికి దీపిక కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News