Rajamouli: ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి నెక్ట్స్ ఫిల్మ్... బాక్సాఫీసు బద్దలయ్యే కాంబినేషన్ సెట్!

  • ఇద్దరు టాప్ హీరోలతో కలిసిన రాజమౌళి
  • కథ చెప్పేశారంటున్న సినీ వర్గాలు
  • అభిమానులు ఖుషీ ఖుషీ
  • ఇంకా రాని అధికారిక ప్రకటన

దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రానికి కథను సిద్ధం చేసుకున్నారా? ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలా? ఈ విషయంలో అధికారిక సమాచారం ఏమీ లేదుగానీ, వీరిద్దరు హీరోలనూ చెరోపక్కన కూర్చోబెట్టుకుని రాజమౌళి దిగిన ఫోటోను ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పంచుకోవడంతో, వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న చర్చ జరుగుతోంది. బాక్సాఫీసు బద్దలయ్యే కాంబినేషన్ ఇదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి ఇద్దరినీ కూర్చోబెట్టి కథను వినిపించారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటుండగా, "మీ ఊహకే వదిలేస్తున్నా..." అన్నట్టు ఈ ఫొటోకు రాజమౌళి క్యాప్షన్ పెట్టారు.

ఇక ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ చిత్రాలను, రామ్ చరణ్ హీరోగా మగధీర చిత్రాన్ని రాజమౌళి అందిస్తే, అన్నీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక బాహుబలి రెండు చిత్రాల తరువాత రాజమౌళి చేయబోయే సినిమాపై జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతున్న వేళ, ఆయన మల్టీ స్టారర్ స్టోరీతో రానున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా వార్తలకు బలం చేకూరుస్తూ రాజమౌళి ఈ ఫొటోను షేర్ చేయడం గమనార్హం. ఇక ఈ కాంబినేషన్ నిజమే అయితే, వచ్చే సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లవచ్చని భావించవచ్చు.

More Telugu News