India: 50 పరుగులకు 5 వికెట్లు... అత్యంత చెత్తగా సాగుతున్న భారత బ్యాటింగ్!

  • పేలవంగా సాగుతున్న భారత్ ఆట
  • షనాకా బాల్స్ కు దొరికిపోయిన అశ్విన్, రహానే
  • ప్రస్తుతం స్కోరు 29 ఓవర్లలో 55/5

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. గురువారం నాడు లక్మల్ (6-6-0-3) అద్భుత బౌలింగ్ దెబ్బకు 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్, నేడు ఉదయం ఆదిలోనే మరో రెండు వికెట్లను సమర్పించుకుంది. నేడు రహానే 4 పరుగులు చేసి (21 బంతుల్లో), ఆర్ అశ్విన్ నాలుగు పరుగులు చేసి (29 బంతులకు) పెవీలియన్ దారి పట్టారు. ఈ రెండు వికెట్లూ షనకా ఖాతాలోకి వెళ్లాయి.

దీంతో భారత జట్టు 50 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది. ఈడెన్ పిచ్ పై బంతి అనూహ్యంగా స్వింగ్ అవుతూ భారత బ్యాట్స్ మన్లను ఇబ్బందులు పెడుతుండగా, లంక బౌలర్లు విజృంభిస్తున్నారు. ప్రస్తుతం పుజారా 91 బంతుల్లో 33 పరుగులతో ఆడుతుండగా, మరో ఎండ్ లో సాహా పరుగులేమీ చేయకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు తంటాలు పడుతున్నాడు. భారత స్కోరు 29 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు.

More Telugu News