rohingya: ఈతరాకున్నా.. ప్లాస్టిక్ క్యాన్ సాయంతో దేశం దాటేసిన మయన్మార్ బాలుడు!

  • ప్లాస్టిక్ డబ్బాతో దేశం దాటేసిన రోహింగ్యా బాలుడు 
  • నదిలో రెండున్నర మైళ్లు ప్రయాణించి బంగ్లాదేశ్ చేరిన వైనం 
  • దేవుడి దయ వల్ల బతికానన్న బాలుడు 

మయన్మార్‌ కు చెందిన రోహింగ్యా బాలుడు ఈతరాకున్నా ప్లాస్టిక్ క్యాన్ సాయంతో దేశం దాటేసిన ఘటన చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. గత కొంత కాలంగా మయన్మార్ లో రోహింగ్యాలపై దాడులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈత ఏమాత్రం తెలియని నబీ హుస్సేన్ (13) అనే బాలుడు ఓ ప్లాస్టిక్ క్యాన్ ను పట్టుకుని నదిని దాటేసి, బంగ్లాదేశ్ చేరుకున్న ఘటన వెలుగు చూసింది.

ఈ విషయంపై ఆ బాలుడు మాట్లాడుతూ, మయన్మార్ లోని కొండల్లో తాము ఉంటున్నామని తెలిపాడు. మయన్మార్ లో హింసను తాళలేక దేశం విడిచి వెళ్లిపోవాలని పసుపు రంగు ప్లాస్టిక్ డబ్బా పట్టుకుని నదిలో దూకేశానని అన్నాడు. నదిలో దూకిన తరువాత చచ్చిపోతానని అనిపించిందని తెలిపాడు. అయితే దేవుడి దయవల్ల బతికి బయటపడ్డానని అన్నాడు. తనకు బంగ్లాదేశ్ లో ఎవరూ తెలియదని, ఇలా దేశం దాటి వచ్చేసినట్టు తన తల్లిదండ్రులకు కూడా తెలియదని ఆ బాలుడు తెలిపాడు. కాగా, బాలుడు రెండున్నర మైళ్ల దూరాన్ని అధిగమించి దేశం దాటినట్టు తెలుస్తోంది. 

More Telugu News