శశికళ ఇళ్లపై మూడో రోజూ కొనసాగిన ఐటీ దాడులు.. నేలమాళిగల్లో గుట్టలుగా డబ్బు, వజ్రాభరణాలు!
- శశికళ సోదరుడు నిర్వహిస్తున్న హాస్టల్పైనా దాడులు
- బయటపడుతున్న ఆస్తులు చూసి విస్తుపోతున్న అధికారులు
- రూ.6 కోట్ల నగదు, 15 కేజీల బంగారం, రూ. 1200 కోట్ల ఆస్తులు బయటపడిన వైనం!
శశికళ సోదరుడు దినకరన్ నిర్వహిస్తున్న ఓ లేడీస్ హాస్టల్లో జరిపిన దాడుల్లో నేలమాళిగలు బయటపడ్డాయి. మన్నార్గుడి ప్రాంతంలోని సుందరకొట్టాయ్లో ఉన్న ఈ హాస్టల్లోకి అధికారులు అడుగుపెట్టకుండా దినకరన్ అనుచరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపు 60 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడినట్టు తెలుస్తోంది.
మూడు రోజులుగా జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్ల నగదు, 15 కేజీల బంగారం, రూ.1200 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్టు సమాచారం. చెన్నైలోని మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన జయ టీవీ కార్యాలయం, నమదు ఎంజీఆర్ దినపత్రిక సీఈవో వివేక్ జయరామన్, టి.నగర్ హబీబుల్లా రోడ్డులోని కృష్ణప్రియ నివాసాల్లో అధికారులు శనివారం మూడో రోజు సోదాలు నిర్వహించారు. ఇటీవల పెరోల్పై బయటకు వచ్చిన శశికళ స్థిరాస్తుల లావాదేవీలు జరిపినట్టు అనుమానిస్తున్న అధికారులు దానిపైనా దృష్టి సారించారు.