Sachin Tendulkar: బాల్య మిత్రులు సచిన్, కాంబ్లీ కలిసిపోయారోచ్!

  • విభేదాలు మరిచి, కలసిపోయిన సచిన్, కాంబ్లీ
  • ఫొటోనే షేర్ చేసిన సచిన్
  • క్రికెట్ తనకు మంచి స్నేహితులను ఇచ్చిందంటూ కామెంట్

భారత మాజీ స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు బాల్యమిత్రులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కాలక్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తి, ఇద్దరూ దూరమయ్యారు. తాజాగా, వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారు. తన చిన్ననాటి మిత్రుడు సచిన్ తో తొలి సెల్ఫీ అంటూ గత నెలలో సోషల్ మీడియాలో కాంబ్లీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా, సచిన్ కూడా 'ఫ్రెండ్స్ ఫర్ లైఫ్' అంటూ తన మిత్రులతో దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్, కాంబ్లీ, అతుల్ కస్బేకర్, అజిత్ అగార్కర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా ఓ ఫొటో దిగారు. ఈ ఫొటోను షేర్ చేసిన సచిన్... 'క్రికెట్ నాకు ఇచ్చిన అత్యద్భుతమైన విషయాల్లో... జీవితాంతం తోడుండే మిత్రులను కూడా ఇవ్వడం ఒకటి' అంటూ కామెంట్ పెట్టాడు.

సచిన్, కాంబ్లీల మధ్య వివాదం విషయానికి వస్తే... తన కెరీర్ పతనం అవుతున్నప్పుడు వ్యక్తిగతంగా కానీ, ప్రొఫెషన్ పరంగా కానీ సచిన్ తనకు అండగా నిలవలేదని గతంలో కాంబ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. తన బాధను తెలియజేస్తూ ఓ టీవీ షోలో కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయం క్రికెట్ ప్రేమికుల్లో కలవరం రేపింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు గడిచింది.

మరోవైపు, కాంబ్లీ వ్యాఖ్యలపై సచిన్ స్పందించలేదు. కాంబ్లీ అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా అతన్ని పరామర్శించడానికి సచిన్ వెళ్లలేదు. దీనికి తోడు సచిన్ వీడ్కోలు కార్యక్రమానికి కూడా కాంబ్లీకి ఆహ్వానం అందలేదు. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలసిపోవడం పట్ల క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News