NTR: భద్రాద్రి రామయ్య దర్శనానికి బయలుదేరిన ఎన్టీఆర్.. పోలీసుల భద్రతా ఏర్పాట్లు!

  • సతీసమేతంగా రామయ్యను దర్శించుకోనున్న ఎన్టీఆర్
  • ఆయన వెంట దర్శకుడు కొరటాల శివ, పలువురు నిర్మాతలు
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామావు (జూనియర్ ఎన్టీఆర్) ఈ ఉదయం సతీసమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. ఈ మేరకు వల్లూరిపల్లి వంశీకృష్ణ, బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీష్, తాళ్లూరి రమేష్ సంతకాలతో ఉన్న లేఖ భద్రాచలం తహశీల్దార్‌కు అందింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్  నుంచి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి భద్రాచలం చేరుకోనున్నారు.

ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కుటుంబసభ్యులతోపాటు మరో ఏడుగురు నిర్మాతలు కూడా స్వామి వారి దర్శనానికి వెళ్తున్న వారిలో ఉన్నారు. ఉదయం 9 గంటలకు భద్రాచలం చేరుకోనున్న వీరు అరగంటపాటు పూజలో పాల్గొంటారు. 9.45 గంటలకు ఆలయం నుంచి ఐటీసీ క్వార్టర్స్ సమీపంలోని తాళ్లూరి రమేశ్ ఇంటికి చేరుకుని అల్పాహారం తీసుకుంటారు.

అనంతరం 11.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారని లేఖలో పేర్కొన్నారు. రామయ్య దర్శనానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలియడంతో అభిమానులు అతడిని చూసేందుకు ఎగబడే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

More Telugu News