amith shah: రోడ్డుపై అతి భారీ ట్రాఫిక్‌ జామ్.. విమానాశ్ర‌యంలోనే చాలాసేపు ఉండిపోయిన‌ అమిత్ షా

  • బెంగళూరు-తుమకూరు జాతీయ రహదారిలో కిలోమీటర్ల మేర‌ ట్రాఫిక్ జామ్
  • భార‌తీయ జ‌న‌తా పార్టీ పరివర్తనా యాత్ర
  • అతి భారీగా త‌ర‌లివ‌చ్చిన‌ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు
  • ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షాను తీసుకెళ్లిన బీజేపీ నేత‌లు

బెంగళూరు-తుమకూరు జాతీయ రహదారిలో కిలోమీటర్ల మేర‌ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రోజు బెంగళూరు నగర శివార్లలోని తుమకూరు రోడ్డులోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ పరివర్తనా యాత్ర కార్యక్రమం చేప‌డుతోంది. ఇందులో పాల్గొన‌డానికి జాతీయ రహదారి మీదుగా అతి భారీగా కార్య‌క‌ర్త‌లు, అభిమానులు చేరుకుంటున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొనాల్సి ఉంది.

బెంగ‌ళూరుకి వ‌చ్చిన అమిత్ షా రోడ్డు మార్గంలో వెళ్లి కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌నుకున్నారు. వాహ‌నాలు ముందుకు క‌దిలే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో అమిత్ షా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే చాలాసేపు ఉన్నారు. రోడ్డు ఇప్ప‌ట్లో క్లియ‌ర్ అయ్యే ప‌రిస్థితి లేద‌ని తెలుసుకుని, ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షాను అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానం దగ్గరకు తీసుకెళ్లారు. మ‌రోవైపు భారీగా  ట్రాఫిక్ జాం కావడంతో అంబులెన్స్ లు కూడా ముందుకు క‌ద‌ల‌డం లేదు. దీంతో రోగులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.  

More Telugu News