jagan: పాదయాత్రకు ముందు జగన్ లండన్ వెళ్లనున్న కారణమిదే!

  • 28న లండన్ కు జగన్
  • అక్కడ చదువుతున్న కుమార్తెను చూసి వచ్చేందుకే
  • లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జగన్ కూతురు
  • ఆరు రోజుల పాటు సాగనున్న పర్యటన

నవంబర్ 6 నుంచి పాదయాత్రను తలపెట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్, అంతకన్నా ముందు లండన్ లో పర్యటించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న లండన్ కు వెళ్లనున్న జగన్, 2వ తేదీలోగా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 27న శుక్రవారం కోర్టు విచారణ తరువాత ఆయన బయలుదేరుతారని, తిరిగి 3న విచారణలోగా తిరిగి వస్తారని వైకాపా వర్గాలు వెల్లడించాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళుతున్నారని తెలిపాయి.

పాదయాత్ర ప్రారంభమైతే, మరో ఆరేడు నెలల పాటు జగన్ విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటారు కాబట్టి, ఈలోగా తన కుమార్తె క్షేమ సమాచారాలను స్వయంగా తెలుసుకోవాలని భావించిన మీదట, కోర్టు అనుమతి తీసుకుని ఆయన లండన్ బయలుదేరనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రెండు నెలల క్రితం సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో జగన్ స్వయంగా వెళ్లి తన కుమార్తెను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేర్చి వచ్చిన సంగతి తెలిసిందే. లండన్ తో పాటు యూరప్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆయన టూర్ ఉంటుందని సమాచారం.

More Telugu News