ys jagan: జగన్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన వంగవీటి రాధా!

  • గౌతంరెడ్డి అనుచరుడికి పదవిని కట్టబెట్టిన జగన్
  • జగన్ నిర్ణయంతో రాధా విస్మయం
  • వేడెక్కిన విజయవాడ వైసీపీ రాజకీయం

వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, విజయవాడకు చెందిన వైసీపీ నేతలు వంగవీటి రాధా, గౌతమ్ రెడ్డిల మధ్య ఇటీవల వివాదం నెలకొంది. తన తండ్రి రంగాపై గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో... ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో, గౌతమ్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయినప్పటికీ గౌతమ్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో, గౌతమ్ రెడ్డిని జగన్ బంధువు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలసి దిగిన ఫొటో వైరల్ గా మారింది.

మరోవైపు గౌతమ్ రెడ్డి అనుచరుడైన ఒక వ్యక్తికి డివిజన్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాను సూచించిన మైనార్టీ నేతకు కాకుండా, గౌతమ్ రెడ్డి అనుచరుడికి బాధ్యతలను అప్పగించడంతో రాధా విస్మయానికి గురయ్యారు. జగన్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల విజయవాడకు జగన్ వచ్చిన సందర్భంలో కూడా జగన్, రాధాల మధ్య ఇదే విషయంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు విజయవాడ వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. 

More Telugu News