శ్రీధర్ బాబు: నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: శ్రీధర్‌బాబు

  • కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
  • రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు
  • మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు

తనను గంజాయి కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు యత్నిస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపిస్తూ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ విషయమై శ్రీధర్ బాబు స్పందిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.

రాజకీయ దురుద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయిస్తోందని, భూ నిర్వాసితులకు అండగా ఉన్నామన్న కక్షతోనే తమపై కేసులు పెట్టిస్తోందని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని శ్రీధర్ బాబు చెప్పారు. కాగా, శ్రీధర్ బాబుపై ఆరోపణల నేపథ్యంలో ఆయన అనుచరులు సుదర్శన్, భార్గవ్, నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీధర్ బాబు, సుదర్శన్ ఫోన్ లో జరిపిన సంభాషణ రికార్డులను పోలీసులు పరిశీలించారు.

More Telugu News