revanth reddy: రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం లేదు: కడియం తీవ్ర వ్యాఖ్యలు

  • రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కడియం శ్రీహరి
  • గతంలో టీడీపీలో ఉండగా సన్నిహితంగా ఉన్న కడియం, రేవంత్
  • కాంగ్రెస్ లో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో మండిపాటు

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి ఆత్మగౌరవం లేని వ్యక్తి అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది శూన్యమని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆ పార్టీ ఓర్వలేకపోతోందని ఆయన మండిపడ్డారు. అలాంటి పార్టీలోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అని ఆయన దుయ్యబట్టారు.

ఇక తెలంగాణలో టీడీపీ ఉందో? లేదో? ఆ పార్టీ నేతలకే తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబువద్ద ఆత్మగౌరవం తాకట్టుపెట్టలేకే తాను టీఆర్ఎస్ లో చేరానని ఆయన అన్నారు. కాగా, నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాను పార్టీ మారడం లేదని నేరుగా రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ మారుతున్నారన్న ఆరోపణలు వినిపించడం విశేషం. 

More Telugu News