car: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి ప్రాణాలు కాపాడిన చెట్టుకొమ్మ!

  • గుంటూరు జిల్లా రేవేంద్రపాడులో ఘటన
  • టైరు పంక్చర్ కావడంతో కాలువలోకి దూసుకెళ్లిన కారు
  • అడ్డుకున్న చెట్టు కొమ్మలు.. ప్రాణాలతో బయటపడిన కుటుంబం

ఓ చెట్టు కొమ్మ మూడేళ్ల చిన్నారి సహా ఆరుగురి ప్రాణాలను కాపాడింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద శనివారం జరిగిందీ ఘటన. తెనాలి మండలం నందివెలుగుకు చెందిన కుటుంబం విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రేవేంద్రపాడు బ్రిడ్జి వద్ద అదుపు తప్పిన కారు నిండుగా ప్రవహిస్తున్న కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కాలువలో జారిపోతున్న కారును ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మలు అడ్డుకుని కారు ముందుకు కదలకుండా ఆపేశాయి.

దీంతో కాలువ సమీపంలో కారు నిలిచిపోయింది. ఆ సమయంలో కారులో మూడేళ్ల బాబు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. చెట్టు కొమ్మలు అడ్డుకోకుండా ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కారు టైరు పంక్చర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

More Telugu News