kangna ranaut: హీరోయిన్ కంగన రనౌత్ పై పరువునష్టం దావా

  • దావా వేసిన ఆదిత్య పంచోలి
  • తన పరువును బజారుకీడుస్తోందంటూ ఆరోపణ
  • కంగనకు గతంలో గాడ్ ఫాదర్ గా ఉన్న పంచోలి

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మరో సమస్య వచ్చి పడింది. సీనియర్ నటుడు ఆదిత్య పంచోలి, ఆయన భార్య జరీనా వహబ్ లు కంగనపై పరువునష్టం దావా వేశారు. ఈ సందర్భంగా ఆదిత్య పంచోలి మాట్లాడుతూ, కొన్నేళ్లుగా కంగన తనకు తెలుసని... అయితే, ఈ మధ్య తన గురించి ఆమె అభ్యంతరకర ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల ప్రస్తావనను కూడా తీసుకొస్తూ, తన పరువును బజారుకీడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను తాను హింసించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని... ఈ ఆరోపణలను మౌనంగా భరించాల్సిన అవసరం తనకేంటని అన్నారు.

మరోవైపు పరువునష్టం దావాలో కంగన సోదరి రంగోలీ పేరును కూడా చేర్చినట్టు సమాచారం. కంగనా సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో ఆదిత్య పంచోలి ఆమెకు గాడ్ ఫాదర్ గా వ్యవహరించారు. అయితే, హీరో హృతిక్ రోషన్ తో ఆమె అఫైర్ వెలుగులోకి రావడంతో... ఆమెను ఆదిత్య పంచోలి దూరం పెట్టేశారనేది బాలీవుడ్ టాక్.

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పంచోలి తనను శారీరకంగా హింసించేవాడని కంగన ఆరోపించింది. ఆమె సోదరి రంగోలి మరో అడుగు ముందుకేసి... వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉండేదంటూ బాంబు పేల్చింది. ఈనేపథ్యంలో వీరిద్దరికీ పంచోలీ లీగల్ నోటీసులు పంపారు. అయితే, ఈ నోటీసులకు వీరిద్దరూ స్పందించకపోవడంతో, చివరకు పరువు నష్టం దావా వేశారు.

More Telugu News