లక్ష్మిపార్వతి: ‘లక్ష్మీ, వెళ్లు!’ అని ఆరోజున ఎన్టీఆర్ ఎందుకన్నారో నాకు తెలియదు: లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్ హయాంలో నేను ఏనాడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు
  • నాకు ‘ఇంగ్లీషు’ తెలియదు...నేను ఎంఏలో సంస్కృతం చేశా
  • జయప్రకాష్ నారాయణ నీతిమంతుడు
  • ఓ ఇంటర్వ్యూలో లక్ష్మిపార్వతి

నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తానెప్పుడూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికారులతో సమావేశం కావడం, ఫైల్స్ చూడటం వంటి వాటి జోలికి వెళ్లలేదని లక్ష్మిపార్వతి అన్నారు. ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ అనే వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆ వ్యవహారాల గురించి తనకు తెలియదని, తనకు ఇంగ్లీషు తెలియదని, ఎంఏ సంస్కృతం చేశానని చెప్పారు. ఇలాంటి విషయాలను నాడు మీడియాలోనే సృష్టించారని అన్నారు. ప్రభుత్వ అధికారులను తాను ఎప్పుడూ కలవలేదనే విషయాన్ని ఎన్టీఆర్ హయాంలో పని చేసిన ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ (జేపీ) కూడా స్పష్టం చేసిన విషయాన్ని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూవర్ స్పందిస్తూ, ‘‘ఓసారి ఎన్టీఆర్ తో ఆయన పర్సనల్ సెక్రటరీ జేపీ మాట్లాడుతుండగా మీరు ఆ గదిలోకి వెళ్లగా, ‘ఇది ప్రభుత్వ వ్యవహారం, దయచేసి వెళ్లండి’ అని జేపీ మిమ్మల్ని అన్నట్లు ఆయనే ఓసారి చెప్పారు. అలా అన్న తర్వాత కూడా మీరు అక్కడే ఉంటే, ‘లక్ష్మీ, వెళ్లు’ అని ఎన్టీఆర్ అన్నట్టు జేపీ గతంలో చెప్పారు!’ అనే ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ, ‘ఆ ఒక్కమాట ఆయన ఎందుకు అన్నారో నాకు తెలియదు! ఎందుకంటే, అసలు, ఎవరి మీటింగుకు నేను వెళ్లను. జేపీ మాతో పాటు టిఫిన్ చేసే మనిషి .. చొరవ ఉన్న మనిషి. అందుకని, ఆ చనువు వల్లే నేను ఆ గదిలోకి వెళ్లి ఉంటానేమో! నాకైతే గుర్తులేదు...అవన్నీ, చాలా చిన్న చిన్న విషయాలు. ఎన్టీఆర్ పర్సనల్ సెక్రటరీ జేపీ. ఎన్టీఆర్ గారు నాకు చెబితే, నాడు గవర్నర్ వద్దకు వెళ్లి బ్రతిమలాడి మరీ, జేపీని పర్సనల్ సెక్రటరీగా తెచ్చుకున్నాం. జేపీ నీతిమంతుడు, నిజాయతీపరుడు అనే ఆయనను పర్సనల్ సెక్రటరీగా తెచ్చుకున్నాం’ అని ఆమె అన్నారు.

More Telugu News