gujarath: ఏడాది వ్యవధిలో ఒకే వ్యక్తితో రెండు సార్లు పెళ్లి... ఇప్పుడు అతను వద్దే వద్దంటున్న భార్య!

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న గుజరాత్ యువతి
  • ఆపై పెద్దల ఒత్తిడితో విడాకులు
  • విడిగా ఉండలేక మళ్లీ ఒకటైన జంట
  • తిరిగి విడదీసిన తల్లిదండ్రులు

ఏడాది వ్యవధిలో ఒకే వ్యక్తిని రెండుసార్లు వివాహం చేసుకున్న ఓ యువతి, ఇప్పుడతనితో ఉండలేనని గుజరాత్ హైకోర్టు ముందు సాక్ష్యమిచ్చిన ఆసక్తికర ఘటన ఇది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ లో ఉండే ఓ 26 ఏళ్ల యువతి ఫార్మసిస్టుగా పని చేస్తోంది. మరో ఫార్మసిస్టు, చిన్నతనం నుంచి కలసి చదువుకున్న వ్యక్తిని నవంబర్ 2016లో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం దారయపూర్ లో రిజిస్టర్ అయింది కూడా.

అయితే, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిసి, ఆమెను బలవంతంగా తీసుకెళ్లగా, వారి బలవంతంపై ఈ సంవత్సరం జూన్ లో భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే, ఈ ఎడబాటు ఎక్కువ కాలమేమీ సాగలేదు. తిరిగి ఆగస్టులో వీరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 14న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

ఈ దఫా మాత్రం మహిళ తండ్రి ఆ జంట వద్దకు వచ్చి పెళ్లికి అంగీకరించామని, ఇంటికి రావాలని కోరాడు. సెప్టెంబర్ 21న వారింటికి తీసుకెళ్లాడు. అక్కడ తనలోని కోపాన్ని చూపించాడు. మళ్లీ విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అల్లుడు వినకపోవడంతో గదిలో పెట్టి తాళం వేసి, కుమార్తెను తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. స్థానికుల సాయంతో బయటపడ్డ అతను, 28వ తేదీన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.

తక్షణం ఆమెను కోర్టు ముందు హాజరు పరచాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు, పోలీసులు ఆమెను కోర్టుకు తెచ్చారు. అప్పుడు తన భర్తకు షాకిస్తూ, తాను అతనితో ఉండబోనని, తల్లిదండ్రులతోనే ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. కారణం ఏంటని న్యాయమూర్తి అడుగగా, భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని బదులిచ్చింది. దీంతో కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేయగా, తల్లిదండ్రులు బెదిరించి తన భార్యతో ఇలా చెప్పించారని భర్త వాపోయాడు.

More Telugu News