kancha ilaiah: ఓయూలో ప్రసంగిస్తూ మరోసారి అగ్గిరాజేసిన ఐలయ్య.. వైశ్యులు, బ్రాహ్మ‌ణుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు!

  • అగ్ర‌కులాల అహంకారంపై పుస్త‌కాలు రాస్తోంటే విదేశీ ఏజెంట్ అంటున్నారు
  • కిందికులాల వారికి బ్రాహ్మ‌ణులు, కోమ‌ట్ల కంటే వంద‌రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంది
  • సరిహద్దుల్లో నిలబడి కిందికులాల వారు దేశాన్ని రక్షిస్తున్నారు 
  • నా ప్రశ్నలకు వైశ్యులు, బ్రాహ్మణులు సమాధానం చెప్పాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీల‌ను అవ‌మాన ప‌ర్చిన అగ్ర‌కులాల అహంకారంపై తాను పుస్త‌కాలు రాస్తోంటే త‌న‌ను విదేశీ ఏజెంట్ అని అంటున్నార‌ని కంచ ఐల‌య్య మండిప‌డ్డారు. మౌన దీక్ష వీడిన ఐల‌య్య ఈ రోజు హైద‌రాబాద్ తార్నాక‌లోని ఓయూలో నిర్వ‌హించిన ఇండియ‌న్ ఇంగ్లిష్ డే ఉత్సవాల్లో పాల్గొని ఉద్వేగభ‌రిత ప్ర‌సంగం చేశారు. కిందికులాల వారికి బ్రాహ్మ‌ణులు, కోమ‌ట్ల కంటే వంద‌రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

కింది కులాల వారికి తెలివిలేదని, మంచోళ్లు కాద‌ని అగ్ర‌కులాల వారు ఎన్నో మాట‌లు మాట్లాడార‌ని ఐలయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా స‌రిహ‌ద్దుల్లో నిల‌బ‌డి చైనా దుర‌హంకారాన్ని (ఆర్మీని) గీత దాటి రాకుండా కాపాడుతున్నార‌ని చెప్పారు. వారివ‌ల్లే దేశం సుర‌క్షితంగా ఉంద‌ని అన్నారు. అగ్ర‌కులాల వారు హిందూమతంలో అంద‌రూ ఒక‌టేన‌ని చెబుతూ త‌మ‌ చెప్పుల‌ను కిందికులాల వారితో మోయిస్తార‌ని, త‌మ ముందు కూర్చోవ‌ద్ద‌ని కూడా అహంకారం ప్ర‌ద‌ర్శిస్తార‌ని ఆయ‌న అన్నారు.

తాను ఎన్న‌డూ వైశ్య స్త్రీల‌ను తిట్ట‌లేదని, కానీ వైశ్య స్త్రీలు ఏది నిజ‌మో తెలుసుకోకుండా తాను రాసిన పుస్త‌కంపై నిర‌స‌న తెలుపుతున్నార‌ని ఐలయ్య అన్నారు. ఇది ద్ర‌విడ దేశం అని, ఆవు దేశం కాద‌ని ఐల‌య్య వ్యంగ్యంగా అన్నారు. ఏ దేవుడు చెప్పులు లేకుండా న‌డిచాడో బ్రాహ్మ‌ణులు చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కిందికులాల వారు చేసే చెప్పులు లేనిదే అగ్ర‌కులాల వారు కాలు బ‌య‌ట పెట్ట‌బోర‌ని చెప్పారు. వైశ్యులు, బ్రాహ్మ‌ణులు త‌న‌ను క్రిస్టియ‌న్ అంటూ అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పారు. 

More Telugu News