టీజీ వెంకటేష్: టీజీ వెంకటేష్ లాంటి వారు అదుపుతప్పి మాట్లాడకూడదు: ప్రొఫెసర్ హరగోపాల్ హితవు

  • కంచ ఐలయ్యకు మద్దతు ప్రకటించిన పౌరహక్కుల సంఘం నేత
  • భావ ఘర్షణను, భౌతిక ఘర్షణలుగా మారుస్తున్నారంటూ విమర్శ
  • పరిపూర్ణానంద స్వామిజీ ఆందోళనకర వ్యాఖ్యలు మానుకోవాలి
  • కంచ ఐలయ్యకు ముప్పు వాటిల్లితే ఆ బాధ్యత  ప్రభుత్వాలదే: పౌరహక్కుల సంఘం

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం ద్వారా ఆర్యవైశ్య సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు మద్దతుగా పౌరహక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ నిలిచారు. భావ ఘర్షణను, భౌతిక ఘర్షణలుగా మారుస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం పోయి హింసగా మారుతోందని అన్నారు. కంచ ఐలయ్యను ఏపీ టీడీపీ నేత టీజీ వెంకటేష్ విమర్శించిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. టీజీ వెంకటేష్ లాంటి వారు అదుపుతప్పి మాట్లాడకూడదని హితవు పలికారు.

ఈ సందర్భంగా ఐలయ్యపై పరిపూర్ణానంద స్వామీజీ చేసిన వ్యాఖ్యలనూ ఆయన ఖండించారు. స్వామీజీ ఆందోళనకర వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను పెంచే బాధ్యత న్యాయస్థానాలపైనా ఉందని, ఐలయ్య స్వేచ్ఛను మానవహక్కుల స్వేచ్ఛగా భావిస్తున్నామని, ఆయనకు మద్దతుగా నిలబడతామని ఈ సందర్భంగా హరగోపాల్ పేర్కొన్నారు.

కాగా, ఐలయ్య ప్రాణాలకు ముప్పు వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, తెలంగాణ పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆయనకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. కంచ ఐలయ్యపై వ్యతిరేకత ఉన్నవారు చర్చలు జరపాలే గానీ, బెదిరింపులకు పాల్పడటం, ఫత్వాలు జారీ చేయడం అప్రజాస్వామికమని పౌరహక్కుల సంఘం మండిపడింది.

More Telugu News