‘ఇంటింటికీ తెలుగుదేశం’: ‘ఇంటింటికీ తెలుగుదేశం’పై గ్రేడింగ్... పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల గ్రేడ్ పై చంద్రబాబు అసంతృప్తి!

  • ‘ఇంటింటికీ తెలుగుదేశం’ నిర్వహించిన నియోజకవర్గాలకు ‘గ్రేడ్స్’ 
  • విజయవాడలో 3 నియోజకవర్గాలకు ‘ఏ’ గ్రేడ్
  • అనంతపురం జిల్లా నాయకులపై మండిపాటు

‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలకు ‘బి’ గ్రేడ్ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నియోజకవర్గాలకు ‘గ్రేడ్స్’ను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ను చంద్రబాబు నిర్వహించారు.

‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి వచ్చిన ‘గ్రేడ్స్’ ను ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు ఆయన చదివి వినిపించారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. తూర్పు విజయవాడ, సెంట్రల్ విజయవాడలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాలు బాగా జరిగాయని ప్రశంసించారు.

ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నాయకులపై చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాను నాశనం చేస్తున్నారని, పార్టీ కార్యక్రమాల్లో ఈ జిల్లా ‘సీ’ గ్రేడ్ లో ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధికి వైఎస్సార్సీపీ అడ్డుపడుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు.

More Telugu News