london: లండ‌న్ నుంచి ఉద‌య్‌పూర్‌కి ప్ర‌జార‌వాణాలో... 40 రోజుల్లో పూర్తి చేసిన యువ‌కుడు!

  • 14 దేశాలు దాటి భార‌త్‌లో అడుగు పెట్టిన ద్రుప‌ద్ మిస్త్రీ
  • మొత్తం 21వేల కిలో మీట‌ర్ల ప్ర‌యాణం
  • టిబెట్‌, చైనా స‌రిహ‌ద్దులో కొన్ని ఆటంకాలు

ఈమధ్య ఎక్కడికైనా వెళ్లాలంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి ప్రజలు కూడా విమానాలను ఆశ్రయిస్తున్నారు. అలాంటిది లండ‌న్ నుంచి భార‌త్‌లోని ఉద‌య్‌పూర్‌కి కేవ‌లం ప్ర‌జార‌వాణాలోనే రావాలంటే ఎంత క‌ష్ట‌మో ఊహించండి. కానీ గుజ‌రాత్‌కి చెందిన ద్రుప‌ద్ మిస్త్రీ అనే యువ‌కుడు ఆ క‌ష్ట‌మైన ప‌నిని ఇష్టంగా పూర్తిచేశాడు. ఈ ప్ర‌యాణంలో మ‌రో ఇద్ద‌రు స్నేహితులు కూడా ద్రుప‌ద్‌తో పాటు క‌లిసి ప్ర‌యాణం చేశారు.

డిజైనింగ్ క‌న్స‌ల్టెంట్‌గా పనిచేసే మిస్త్రీ త‌రచుగా లండ‌న్ వెళ్లాల్సి వ‌స్తుండేది. ఇటీవ‌లే అక్క‌డి ప‌ని పూర్తికావ‌డంతో ఇక ఇండియాలోనే స్థిర‌ప‌డాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. లండ‌న్ నుంచి ఇండియాకు త‌న ప్ర‌యాణాన్ని విభిన్నంగా ఉండాల‌ని విమానాల్లో కాకుండా కేవ‌లం ప్ర‌జార‌వాణానే ఎంచుకున్నాడు. అత‌నితో పాటు స్నేహితులు రాహుల్‌, వెనెటియాలు కూడా క‌లిశారు. వీసాలు, రైలు టిక్కెట్లు, అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాలు స‌రిచూసుకుని మే 25న తమ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు.

త‌మ ప్రయాణంలో అందరికంటే ఎక్కువగా టిబెటిన్లు న‌చ్చార‌ని ద్రుప‌ద్ తెలిపాడు. ద్రుప‌ద్ స్వ‌త‌హాగా సరోద్‌ వాయిద్యకారుడు, రాహుల్‌ వేణుగాన సంగీతకారుడు. దీంతో వారిద్ద‌రూ ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంగీత కళాకారులను కలుసుకుని త‌మ‌ అనుభవాలను పంచుకునేవాళ్లని ద్రుప‌ద్ వివ‌రించాడు. కానీ మంగోలియా-చైనా సరిహద్దుల్లో త‌మ‌కు సమస్యలు తలెత్తాయని, డోక్లాం వివాదం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో త‌మ‌ని చైనా అధికారులు ప్ర‌శ్నించార‌ని ద్రుప‌ద్ చెప్పాడు. అన్ని ర‌కాల త‌నిఖీలు పూర్తి చేసిన త‌ర్వాత వారి ఫోటోలు తీసుకుని సరిహద్దు దాటేందుకు అనుమతి ఇచ్చారని అన్నాడు.

ఇక టిబెట్‌లో కూడా కొన్ని ఆటంకాలు ఎదుర‌య్యాయ‌ని చెప్పాడు. అక్క‌డ విదేశీ ప‌ర్యాట‌కుల‌కు చాలా నిబంధ‌న‌లు ఉంటాయి. వారు స్థానికులతో మాట్లాడకూడదు. కెమెరాలు అమర్చిన రవాణా బస్సుల్లో మాత్రమే ప్రయాణించాలి. ఇటువంటి నిబంధ‌న‌ల కార‌ణంగా కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని ద్రుప‌ద్ వివ‌రించాడు. ఎంతో సుంద‌రంగా క‌నిపించే టిబెట్‌లో సంస్కృతి క్రమంగా కనుమరుగ‌వుతోంద‌ని, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో కూడా ట్రాఫిక్‌ జామ్‌లు కావడం కొంత అసంతృప్తిగా అనిపించింద‌ని ద్రుప‌ద్ అన్నాడు. మొత్తానికి అన్ని ఆటంకాల‌ను ఎదుర్కుని ద్రుప‌ద్ మిస్త్రీ జులై 3న ఉదయ్‌పూర్‌ చేరుకున్నాడు.

More Telugu News