rajastan: బికనేర్ లో దారుణం... ఎస్యూవీలో ఎత్తుకెళ్లి తనపై 23 మంది అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు!

  • మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన దుండగులు
  • 23 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • మెడికల్ రిపోర్ట్ చూసి అరెస్టు చేస్తామంటున్న పోలీసులు

రాజస్థాన్ లోని బికనేర్ లో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. 23 మంది మృగాళ్లు ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డారు. దాని వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌ లోని రిడ్‌ మల్సర్‌ పురోహిటన్‌ కు సదరు మహిళ (28) వెళ్లింది.

ఆ స్థలాన్ని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు మధ్యాహ్నం జైపుర్‌ రోడ్డులో ఖటూశ్యాంమందిర్‌ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఎస్యూవీ వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలోకి లాగేశారు. అక్కడికి సమీపంలోని గనుల ప్రాంతంలోకి కారుని తీసుకెళ్లి వారిద్దరూ పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు.

 అనంతరం మరో ఆరుగురిని ఫోన్ చేసి పిలిచారు. వారు వచ్చి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం పలన అనే గ్రామంలోని విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మరికొంత మంది తనపై అత్యాచారానికి తెగబడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు తనను ఎత్తుకెళ్లిన చోటనే వదిలి వెళ్లిపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్యూవీలో దారుణానికి తెగబడ్డ ఇద్దరితోపాటు 21 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. బాధితురాలు తెలిపిన స్థలంలో కండోమ్ లు స్వాధీనం చేసుకున్నట్టు వారు వెల్లడించారు. ఈ దారుణానికి తెరతీసిన నిందితులను రాజు, సుభాష్ గా గుర్తించామని, మహిళ వైద్యపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు. దీనిపై ఇంకా ఎవర్నీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది. 

More Telugu News