జూనియర్ ఎన్టీఆర్: అటువంటి విమర్శకుల గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడటం నాకు బాధగా ఉంది!: తమ్మారెడ్డి భరద్వాజ

  • ఎన్టీఆర్ ఆవేదనపై స్పందించిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి  
  •  ప్రతి గొట్టం గాడి మాటలు పట్టించుకోవద్దు
  •  వాళ్ల గురించి మాట్లాడి మన టైమ్ వేస్ట్ చేసుకోవద్దు

సినిమా బాగుందో లేదో నిర్ణయించేది ప్రేక్షకులని, దారినబోయే దానయ్యలు విశ్లేషణలు చేయడం కరెక్టు కాదంటూ నిన్న జరిగిన ‘జై లవ కుశ’ సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆవేదనతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ‘నిన్న ఆయన (జూనియర్ ఎన్టీఆర్) చెప్పినట్టు ఫ్రీ డమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు. అసలు నేనంటాను .. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? లేదా? అని మాట్లాడుకోవడం అనవసరం మనకు. సినిమా తీసిన తర్వాత అసలు అలాంటి వాళ్ల గురించి మనం ఎందుకు ఆలోచించాలి?

‘పేషెంట్ చచ్చిపోతాడని డాక్టర్ కానటువంటి ఓ వ్యక్తి అన్నాడు’ అని నిన్న జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. అలా అనగానే పేషెంట్ చచ్చిపోతాడా? చావడు. బతికించుకునే వాళ్లను డాక్టర్ బతికించుకుంటాడు. అలానే, సినిమాను ప్రేక్షకులు బతికిస్తారు. ఎవడో గొట్టం గాడు చెప్పాడని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గొట్టం గాడి మాట పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడటం టైమ్ వేస్ట్.

విమర్శకుడనే వాడు సద్విమర్శ చేయాలి. సినిమా బాగుంది.. బాగోలేదు. సినిమా బాగుంటే ఎందుకు బాగుంది, బాగుండకపోతే ఎందుకు బాగోలేదో తన వరకు తాను ఎవరైనా చెప్పొచ్చు. అంతేకానీ, ‘సినిమా ఫెయిల్ అయిపోయింది’, ‘కోటి రూపాయలు వస్తాయి’, ‘పది కోట్లు వస్తాయి’, ‘డిపాజిట్లు రావు’ అంటూ విమర్శలు చేసే హక్కు ఏ విమర్శకుడికి లేదు. అసలు, వాళ్లు విమర్శకులే కారు. అటువంటి విమర్శలు చేసే వారి గురించి ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ మాట్లాడటమనేది నాకు నిజంగానే బాధగా ఉంది’ అన్నారు భరద్వాజ.

More Telugu News