anantapuram: రైల్వే స్టేషన్ లో పేలిన తుపాకి... ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు!

  • అనంతపురం రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకి పేలి కలకలం 
  • ప్రయాణికుడి తొందర కారణంగా పేలిన తుపాకి 
  • ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు గాయాలు
  • ఆసుపత్రికి తరలించిన అధికారులు

అనంతపురం రైల్వే స్టేషన్‌ లో ప్రమాదవశాత్తు తుపాకి పేలడంతో తీవ్రకలకలం రేగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హుబ్లీ నుంచి మైసూర్‌ వెళ్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్‌ లో గుంతకల్లు నుంచి అనంతపురం వరకు ఎస్కార్టు విధుల్లో భాగంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు రామచంద్రప్ప, రఫీ వచ్చారు. వీరు ట్రైన్ ఆగడంతో అనంతపురం రైల్వేస్టేషన్‌ లో కిందికి దిగారు.

ఇంతలో ఒక ప్రయాణికుడు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కాడు. ఈ క్రమంలో ఆయన రామచంద్రప్పని తాకుతూ వెళ్లాడు. ఆ జర్క్ కి ఆయన చేతిలోని తుపాకి కిందపడింది. వెంటనే అన్ లాక్ అయి దాని నుంచి బుల్లెట్ బయటకు వచ్చింది. అది నేరుగా రామచంద్రప్ప కాలులోంచి దూసుకెళ్లి, రఫీ తొడలో దిగబడింది. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News