: కొత్త రక్షణ మంత్రి నిర్మలకు తలనొప్పి... సైన్యంలో వివక్ష, పక్షపాతం పెరిగిందని సుప్రీంకోర్టును ఆశ్రయించిన 100 మంది అధికారులు!

అరుణ్ జైట్లీ నుంచి రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టి రోజులు కూడా గడవకుండానే ఆమెకు కొత్త తలనొప్పి మొదలైంది. సైన్యంలో వివక్ష, పక్షపాతం పెరిగాయని సుమారు 100 మందికి పైగా ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది. సైనిక చట్టాలు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, ప్రమోషన్ల నుంచి అందుకునే ప్రోత్సాహాల వరకూ తమపై వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు.

కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధాలు చేసే సైనిక దళాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దేశంలో భద్రతను పర్యవేక్షిస్తూ, సేవా రంగంలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ స్థాయిలో ఉన్న వంద మందికి పైగా అధికారులు ఈ పిటిషన్ వేస్తూ, యుద్ధ దళాలు ఎంత ఒత్తిడిలో ఉంటాయో, తాము కూడా అంతే ఒత్తిడిలో పని చేస్తున్నామని తెలిపారు. సైనికుల తరఫున న్యాయవాది నీలా గోఖలే ఈ పిటిషన్ వేశారు. లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి నేతృత్వంలో ఓ టీమ్ గా ఏర్పడిన సైనికులు తమకు జరుగుతున్న అన్యాయంపై కోర్టును ఆశ్రయించారు.

More Telugu News