: వేగంగా న్యాయం... పదేళ్లు దాటిన కేసులే లేని హర్యానా, పంజాబ్, హిమాచల్, కేరళ!

ఒకసారి కోర్టుకు ఎక్కితే న్యాయం జరిగేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని పరిస్థితి, దశాబ్దాలకు పైగా సాగుతున్న కేసులు ఇండియాలో సర్వసాధారణమన్న సంగతి తెలిసిందే. కానీ ఈ పరిస్థితిని మార్చి చూపాయి నాలుగు రాష్ట్రాలు. పదేళ్లకు పైగా కోర్టుల్లో పెండింగ్ లో ఉండిపోయిన కేసులను ఫాస్ట్ ట్రాకింగ్ విచారణ ద్వారా దాదాపు శూన్య స్థాయికి చేర్చాయి హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు. ఇక ఇదే దారిలో పయనిస్తున్న ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సైతం పెండింగ్ కేసులను పరిష్కరించడంలో వేగంగా కదులుతున్నాయి.

వాస్తవానికి ఇండియాలో పదేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న కేసులు దాదాపు 23 లక్షలు ఉన్నాయి. జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ గణాంకాల ప్రకారం మొత్తం 2.54 కోట్ల కేసులు 17 వేల కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు స్థాయిలో ఉన్న కేసులు వీటికి అదనం. చాలా కేసుల్లో నిందితులుగా జైళ్లలో మగ్గుతున్న వారు, చేసిన నేరానికి పడే గరిష్ఠ శిక్షకన్నా ఎక్కువ కాలం విచారణ ఖైదీగా కూడా ఉన్న సందర్భాలు కోకొల్లలు. దేశంలోని జైళ్లలో ఉన్న ఖైదీల్లో మూడింట రెండు వంతుల మంది విచారణ ఖైదీలేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం కేసుల్లో 15 శాతం కేసులు మహిళలు, సీనియర్ సిటిజన్లకు సంబంధించినవేనని కూడా డేటా చెబుతోంది.

ప్రస్తుతం గుజరాత్ లో అత్యధిక సంఖ్యలో కేసులో పెండింగ్ పడిపోయి ఉండగా, ఆపై ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నిలిచాయి. ఈ రాష్ట్రాల కోర్టుల్లోనూ ఫాస్ట్ ట్రాక్ విచారణ, లోక్ అదాలత్ లను విరివిగా నిర్వహించడం ద్వారా పెండింగ్ కేసులను కొలిక్కితెచ్చి, కోర్టులపై ఉన్న ఒత్తిడిని తగ్గించాలని న్యాయశాఖ ప్రయత్నిస్తోంది.

More Telugu News