: తనదాకా వస్తే కానీ..! చిన్నారిపై అత్యాచారం చేశాడు.. కూతురి రక్షణపై ఆవేదన చెందుతున్నాడు!

ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదన్న విషయం ఇతడిని చూస్తే అర్థం అవుతుంది. స్కూలు ఆవరణలో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన 38 ఏళ్ల నిందితుడు ఇప్పుడు తన కుమార్తె రక్షణ గురించి తెగ బాధపడిపోతున్నాడు. తన కుమార్తెకు ఏమీ జరగకుండా కాపాడాలంటూ ఇంటరాగేషన్ సమయంలో అధికారులకు మొరపెట్టుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన వికాస్ (38) గాంధీనగర్‌లో భార్య, 16 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. 2009లో వికాస్ ఢిల్లీకి వచ్చాడు. దీంతో ఆయన 14 ఏళ్ల కుమారుడు జార్ఖండ్‌లో బంధువుల ఇంటిలో ఉండి చదువుకుంటున్నాడు.

మూడేళ్ల క్రితం వికాస్ ఓ స్కూల్‌లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. ఇటీవల స్కూలు వ్యాన్‌లో పిల్లల్ని ఎక్కించే పనికి మారాడు. గతంలో వికాస్ రెండు స్కూళ్లలో డ్రైవర్‌గానూ పనిచేశాడు. కాగా, ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్‌లో చదువుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై వికాస్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఉస్మాన్‌పూర్‌లోని బంధువుల ఇంటికి పారిపోయాడు. అతడి సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆదివారం అతడిని 14 రోజుల జుడీషియల్ కస్టడీపై తీహార్ జైలుకు పంపారు.

కాగా, అధికారుల విచారణలో వికాస్ పలు విషయాలను వెల్లడించాడు. తన కుమార్తె భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమెపై ఎవరి కన్ను పడకుండా రక్షించాలని వేడుకున్నాడు. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు తన కుమార్తె గురించి బాధపడడం చూసి అధికారులు విస్తుపోయారు.

More Telugu News