: మా అబ్బాయికి మంచి అమ్మాయి దొరకాలని దేవుడిని ప్రార్థించా: హీరో శింబు తండ్రి

కోలీవుడ్ హీరో శింబు తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు టి.రాజేందర్ తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడికి మంచి అమ్మాయి దొరకాలని వెంకన్నను కోరుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం శింబుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పారు. శింబు, నయనతార జంటగా నటించిన 'సరసుడు' సినిమా ఈనెల 15న విడుదల కాబోతోందని... ఈ సినిమా విజయవంతం కావాలని స్వామిని మొక్కుకున్నానని తెలిపారు.

తనను అభిమానించినట్టే, శింబును కూడా తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. 'సరసుడు' సినిమాకు తాను మాటలు, పాటలు రాశానని చెప్పారు. జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడులో రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని... ప్రతి ఒక్కరూ సీఎం కావాలనుకోవడం మంచిది కాదని అన్నారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏ ఒక్క రాజకీయ నేత కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తాను స్థాపించిన లక్ష్యా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అనేక సంక్షేమ పథకాలను చేపడుతోందని చెప్పారు. 

More Telugu News