: 'నేను ఎమ్మెల్యే భార్యను... నాకు న్యాయం కావాలి' అంటూ ఒడిశా సీఎం నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ!

తాను ఎమ్మెల్యే భార్యనని, రెండు సార్లు తనకు బలవంతంగా అబార్షన్ చేయించాడని, తనకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ ఓ మహిళ ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం పెను కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఒడిశాలోని భువనేశ్వర్ లో సీఎం నివాసం వద్దకు ఒక మహిళ వచ్చింది. సీఎంను కలిసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెకు అవకాశం దక్కలేదు. దీంతో చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

ఈ నేపథ్యంలో ఆమెను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, బీజేడికీ చెందిన తాల్చర్ ఎమ్మెల్యే బ్రజా కిషోర్ ప్రధాన్ తనను మూడేళ్లక్రితం వివాహం చేసుకున్నాడని తెలిపింది. అనంతరం రెండు సార్లు తాను గర్భం దాల్చానని చెప్పింది. ఈ రెండు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. గత మే 9న తన స్వగ్రామమైన హందిదువాలో ఎమ్మెల్యే ప్రధాన్ ఇంటి ముందు ఆమె ధర్నా చేసింది. కాగా, ఆమె ఆరోపణలను ఎమ్మెల్యే ప్రధాన్ ఖండించారు. 

More Telugu News