: టీడీపీ ఎమ్మెల్యేను కదిలించిన నిరుపేద మహిళ వాట్స్ యాప్ మెసేజ్!

గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గానికి చెందిన మహిళ ఒక్క వాట్స్ యాప్ మెసేజ్ తో స్థానిక ఎమ్మెల్యేను కదిలేలా చేసింది. ఆమె పంపిన వాట్స్ యాప్ మెసేజ్ ఏమిటంటే... "శ్రీయుత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారికి నమస్కారములు. నా పేరు నలబోతుల సీత. భర్త పేరు శ్రీనివాసరావు. పిడుగురాళ్లలో బోయకాలనీకి చెందిన వాళ్లం. నా భర్త ఆగస్టు 14న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై పిడుగురాళ్ల పోలీస్టేషన్‌ లో ఫిర్యాదు చేశాను. చంద్రన్న బీమా కోసం మరణ ధ్రువీకరణ పత్రం కావాలి. దీనికి పోస్టుమార్టం రిపోర్టు కావాలి..ఈ రిపోర్ట్ రావటానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు.

 మరణ ధ్రువీకరణ పత్రం కోసం మున్సిపాలిటీ చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. చంద్రన్న బీమా కూడా వేరేవారు పొందాలని ప్రయత్నం చేయటం వల్ల నేను పొందలేకపోయాను. ఈ విషయాలన్నీ మిమ్మల్ని కలసి వివరించాలని ఉన్నా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. నాకు ఇద్దరు కుమారులు. రోజు గడవటమే కనాకష్టంగా ఉన్న కటిక పేదరికంలో మగ్గుతున్నాను. ఈ పేదరాలి సమస్యను పరిష్కరించటానికి వీలైతే ఒకసారి నాకోసం బోయకాలనీ పిడుగురాళ్లకు రాగలరా? నాకు ఏమైనా న్యాయం చేయగలరా? న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్న మీ నియోజకవర్గ ఓ సామాన్యురాలు" అంటూ ఆమె వాట్స్ యాప్ మెసేజ్ పెట్టింది. ఈ మెసేజ్ ముఖ్యమంత్రి వర్క్‌ షాప్‌ లో బిజీగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేను చేరింది. దీనిని చూసిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. 'శుక్రవారం అందరం కలిసి ఆమె ఇంటికి వెళ్తున్నాం సిద్ధంగా ఉండాలి' అంటూ వారిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమెకు 25,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. 

More Telugu News